మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు... తెలుగువారికి సీఎం రేవంత్ రెడ్డి సూచన

  • గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచన
  • ఎంబసీల మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాలని పిలుపు
  • బహ్రెయిన్‌లోని తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న
  • అవసరమైతే కేంద్రంతో మాట్లాడి క్షేమంగా రప్పిస్తామని హామీ
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న వేళ.. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

ఇరాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడి తెలుగువారు భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు, భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడి ఎంబసీలతో టచ్‌లో ఉండాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, బహ్రెయిన్‌లోని తెలుగువారి భద్రతపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో ఆందోళన నెలకొంది. అక్కడ సుమారు 50 వేల మంది ఏపీ వాసులు ఉపాధి పొందుతుండగా, వారిలో అయ్యన్న సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి తెలుగువారితో ఫోన్‌లో మాట్లాడిన స్పీకర్.. ధైర్యంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.

ఆపద సమయంలో ఏపీఎన్ఆర్‌టీఎస్ ద్వారా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయ్యన్న తెలిపారు. పరిస్థితి విషమిస్తే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో మాట్లాడి.. తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Revanth Reddy
Telangana
Gulf countries
Middle East tensions
Iran
Telugu people
Indian Embassy
Bahrain
APNRTS

More Telugu News